పితృవాక్యపరిపాలన, సత్పరివర్తన, సత్పాలన అన్నీ కలిస్తే శ్రీరాముడు. తరతరాలకూ ఆదర్శపురుషుడు. సీతారాముడిగా హైదరాబాద్లోని శంషాబాద్ సమీపంలో దర్శనమిస్తున్నాడు. వందల ఏళ్లనాటి ఈ ఆలయమే.. అమ్మపల్లి కోదండరామాలయం.

ఆలయ చరిత్ర
    ఆకాశాన్నంటుతున్నట్లుండే గాలిగోపురం, విశాలమైన మండపాలు, ఆహ్లాదపరిచే ప్రకృతిఅందాలు, అమ్మపల్లి కోదండరామస్వామి సన్నిధికి వచ్చే భక్తుల మనసును ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ఆహ్వానం పలుకుతాయి. ఆధ్యాత్మిక, ఆహ్లాద అనుభూతిని పంచుతున్న ఈ ఆలయం చరిత్రకు అందని కాలం నుంచే ఇక్కడ కొలువై ఉంది. పూర్వకాలంలో అమ్మపల్లి పరిసర గ్రామాల్లో ప్లేగు వ్యాధి సోకి అనేకమంది ప్రాణాలు కోల్పోయారట. గ్రామంలో రామాలయం నిర్మిస్తే వ్యాధి నయం అవుతుందని కొందరు మహాత్ములు అక్కడికి వారికి ఆ సమయంలో సూచించారట. అప్పుడే ఆలయం నిర్మితమయ్యింది. ఇథమిత్థంగా ఏ కాలంలో జరిగిందన్నది చెప్పలేకున్నా, 14వ శతాబ్ధానికి చెందిన ఆలయంగా ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది.

ప్రత్యేకత

ఏకశిలపై సీతాసమేతుడై శ్రీరాముడు ఇక్కడ దర్శనమిస్తాడు.ఇదే శిలపై శ్రీ మహావిష్ణువు దశావతారాలు కూడా దర్శనమిస్తాయి.

స్వామిని దర్శిస్తే..

ప్లేగు వ్యాధినుంచి విముక్తి కలిగించిన అమ్మపల్లి శ్రీరాముడు ఆరోగ్యరాముడిగా ప్రసిద్ధికెక్కాడు. అనారోగ్య పీడితులైనవారు, ఇక్కడి కోదండ రామస్వామిని దర్శిస్తే, త్వరితగతిన వ్యాధి నయమవుతుందన్న విశ్వాసం భక్తులది. విద్యాబుద్ధులు ప్రసాదించే దేవుడిగా, ఆర్థిక సమస్యలను తీర్చే దైవంగా, సంతనా,అనారోగ్యసమస్యలున్నవారికి ఆపద్భాందవుడిగా వినుతికెక్కాడు అమ్మపల్లి శ్రీరాముడు.

పూజాదికాలు
ఉదయం ఆరు గంటల నుంచే అమ్మపల్లి కోదండరామస్వామి ఆలయంలో పుజాధికాలు ఆరంభం అవుతాయి. శనివారం ఈ ఆలయంలో ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ప్రతీయేటా శ్రీరామనవమికి అంగరంగ వైభవమైన ఉత్సవాలు నిర్వహిస్తారు.

ఆలయ విశిష్టత
అత్యంత విశాలమైన పరిసరాల్లో నెలవై దర్శించినంతనే మనసుకు ఆహ్లాదానుభూతిని ప్రసాదించే చూడచక్కని ఆలయం అమ్మపల్లి కోదండరామస్వామి ఆలయం. గగనాన్ని తాకుతుందా అనిపించే ఎత్తైన రాజగోపురం, దాన్ని దాటుకుని వెళ్లగానే కనిపించే విశాలమైన మంటపాలు, చుట్టూ కోనేర్లు భక్తులకు దర్సనమిస్తాయి. పూర్వ కాలంలో వివిధ వృత్తుల వారు ఈ కోనేర్ల ఒడ్డునే తమ కుల వృత్తులు నిర్వహించేవరాట.

    అమ్మపల్లి కోదండరామస్వామి ఆలయ రాజగోపుర నిర్మాణం ఆధారంగానే కుతుబ్ షాహీ సుల్తానులు చారిత్రక చార్మినార్ ను నిర్మించారట. శతాబ్ధాల క్రితం వేంగి రాజులు ప్రతిష్టించినట్లుగా భావించే అనేక శిల్పాలు ఈ ఆలయంలో దర్శనమిస్తాయి.

ఎలా వెళ్లాలి?
అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న శంషాబాద్ కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది అమ్మపల్లి. హైదరాబాద్ నుంచి శంషాబాద్ ముప్పై కిలోమీటర్లు. చార్మినార్, కోఠి, సికింద్రాబాద్, మహాత్మాగాంధీ బస్ స్టేషన్, దిల్ సుఖ్ నగర్ ల నుంచి శంషాబాద్ కు విస్తృతమైన బస్సు సౌకర్యాలు ఉన్నాయి. శంషాబాద్ నుంచి అమ్మపల్లికి నిరంతరం ఆటోలు తిరుగుతూ ఉంటాయి.


కోనసీమ అందాలు, పావన గోదావరీ గలగలలతో అలరారుతూ ప్రాకృతిక సౌందర్యం కొలువైన జిల్లా తూర్పుగోదావరి జిల్లా. కోస్తాంధ్రకు కీలకస్థానమైన ఈ జిల్లాకు ఆధ్యాత్మిక గుర్తింపు తెచ్చిన దేవస్థానం అంతర్వేది లక్ష్మీనరసింహాలయం.

నరసింహుని రూపం ఉగ్రరూపం. మృగరాజైన సింహం తలతో ప్రళయభీకరంగా కనిపించినా, భక్తుల పాలిట మాత్రం మనసున్న దేవుడే. భక్త సులభుడని పేరున్న శ్రీ మహావిష్ణువు దశావతార స్వరూపమే నరసింహావతారం. దేవదేవుడైన మహావిష్ణవు లోకకళ్యాణం కోసం దశవతారాలను దాల్చగా, అందులో నాలుగో అవతారం నారసింహావతారం.

ఆలయ విశిష్టత
బంగాళాఖాతం తీరాన కొలువైన క్షేత్రం అంతర్వేది. ప్రశాంత పరిసరాల్లో కొలువైన ఈ ఆలయాన్ని దర్శిస్తే మనసు కూడా అంతే ప్రశాంతంగా మారుతుందట. ఎన్ని సమస్యలతో ఈ క్షేత్రంలో అడుగుపెట్టినా, అన్నీ దూరమైన అనుభూతి ప్రసాదిస్తాడని అంతర్వేది నరసింహస్వామికి పేరు.

కోరమీసాలవాడు అంతర్వేది నారసింహుడు. కోరమీసాలు.. వీరత్వానికి ప్రతీక. అలాంటి ఈ స్వామిని మొక్కుకుంటే అనంత ధైర్యసాహసాలను ప్రసాదిస్తాడట. మానసిక ఆందోళనలతో బాధపడేవారు ఈయన మీద భారం వేసి కేవలం టెంకాయ సమర్పించినా, ధృడమైన మనసును ఇస్తాడని భక్తుల నమ్మకం. ఏదైనా ఇబ్బందితో బాధపడుతున్నవారు ఈ సన్నిధిలో 5 ప్రదిక్షణలు చేసి టెంకాయ సమర్పిస్తే చాలంటారు. అంతటి మహిమాన్విగా ఈ స్వామి మహిమలను చాటుతున్నాడు.

పూజాదికాలు

ఈ పుణ్యప్రదేశంలో సుప్రభాతం, నివేదన, అష్టోత్తర పూజలు, నరసింహ దండకాలు, హారతులతో ఈ క్షేత్రం మారుమోగుతూ ఉంటుంది. అంతర్వేది క్షేత్రంలో నిత్యం అభిషేకాలు, హోమాలు, యాగాలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ కలశపూజలను సైతం విశేషంగా నిర్వహిస్తారు. అంతర్వేది క్షేత్రంలో ఉత్సవమూర్తుల వద్ద అర్చన చేయించుకుంటే చాలా శుభప్రదం అని అంటారు. దంపతులు ఇలా పూజార్చన నిర్వహిస్తే, సంసార జీవితంలో కలతలు ఉండవని, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి.

అంతర్వేది నరసింహస్వామి ఉత్సవాల్లో ఫిబ్రవరి మాసంలో ఇక్కడ నిర్వహించే స్వామి కళ్యాణోత్సవాలు, రథోత్సవాలు ప్రధానమైనవి. ఈ వేడుకలనే అంతర్వేది తిరునాళ్లని అంటారు. రథారూఢుడైన స్వామి భిన్న విభిన్న రూపాలు దాల్చి ఆలయ పురవీధుల్లో ఊరేగుతారు.

చారిత్రక సంపద

ఈ ఆలయాన్ని 15 నుంచి 16 వ శతాబ్ధం మధ్యలో నిర్మితమైనట్లు ఆధారాలను బట్టి తెలుస్తోంది. అనేకమంది రాజులు, చక్రవర్తులు ఈ ఆలయ అభివృద్ధికి పాటుపడ్డారు. కనువిందైన ఆలయ స్తంభాలు, అబ్బురపరిచే విగ్రహాలు, విశాల మండపాలు, ప్రాకారాలు, గోపురాలతో భారతీయ ఆధ్యాత్మిక వైభవానికి అచ్చమైన ప్రతిరూపంగా ఈ క్షేత్రం కనిపిస్తుంది.

స్థల పురాణం

కృతయుగంలో వశిష్ట మహాముని గోదావరిలోని ఓ పాయను తెచ్చి సాగరసంగమం గావించి ఇదే ప్రాంతంలో తపస్సు చేస్తుంటాడు. అయితే విశ్వామిత్రుని ప్రోద్భలంతో రక్తవిలోచనుడు అనే రాక్షసుడు వశిష్టుని తపస్సుకు భంగం కల్గించడమే కాకుండా, అతని కుమారులను హతమారుస్తూ ఉంటాడు. అప్పుడు వశిష్టుడు నరసింహస్వామిని ప్రార్ధించగా, ఆయన ప్రత్యక్షమై రక్తవిలోచనుడితో యుద్ధం చేస్తాడు. ఆ రాక్షసుడిని భూమిపై పడే ప్రతీ రక్తపు బొట్టూ, ఓ రాక్షసుడిగా మారుతుంటుంది. అప్పుడు నరసింహుడు అశ్వరూఢాంబికా అనే మాయాశక్తిని రప్పించి, రాక్షసుడి రక్తం నేలపై పడకుండా నాలుక చాచాలని సూచిస్తాడు. స్వామి ఆదేశం మేరకు ఆమె నాలుక చాచగా, రాక్షసుడిని నరసింహుడు సంహరిస్తాడు. ఆపై , వశిష్టుని కోరిక మేరకు నరసింహాస్వామికి ఇక్కడ కొలువైనట్లు ప్రతీతి.

ఎలా వెళ్లాలి?

అంతర్వేది క్షేత్రం ఉభయగోదావరి జిల్లాల మధ్యలో ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు నుంచి, పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురం నుంచి విస్తృతమైన రవాణా సౌకర్యాలు ఉన్నాయి. నర్సాపురానికి హైదరాబాద్ నుంచి రైళ్లో కూడా వెళ్లవచ్చు.
శక్తికి ప్రతిరూపమైన అమ్మవారి రూపాలు అనేకం. ఆదిశక్తిగా, పరాశక్తిగా, జగన్మాతగా, లోకేశ్వరిగా విభిన్న రూపాల్లో పూజలందుకునే ఆ తల్లి మహాశక్తి స్వరూపిణి. శక్తికి రూపమైన ఆ తల్లి కొలువైన పరమ పవిత్ర దివ్యధామాలు అష్టాదశ శక్తి పీఠాలు. మహామహిమాన్వితమైన ఆ శక్తిపీఠాల్లో ఒకటి మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్. జోగులాంబ ఇక్కడ కొలువైన అమ్మవారు భక్తులకు దర్శనిమస్తుంటారు. రాయలసీమ ముఖద్వారం కర్నూలుకు సమీపంలో, మహబూబ్ నగర్ జిల్లా శివారులో నెలవై ఉంది ఆలంపూర్ పట్టణం. ఆలయాల నగరంగా ప్రఖ్యాతి గాంచిన ఆలంపూర్ పట్టణసిగలో మణిముకటమై వెలసింది ఇక్కడి జోగులాంబ ఆలయం. పరమ పవిత్ర అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా, పావన తుంగభద్రా నది తీరాన, ఇక్కడ అమ్మవారు జోగులాంబగా వెలిసి భక్తులపై తన కరుణాకఠాక్షాలను చూపుతున్నారు.
స్థల పురాణం
అష్టాదశ శక్తిపీఠాల ఆవిర్భావం వెనుక పరమశివునితో కూడాన పురాణగాథ ప్రాచుర్యమంలో ఉంది. శివుని భార్య సతీదేవి తండ్రి దక్షుడు చేపట్టిన యజ్ఞానికి వెళ్లి అవమానాల పాలై, అక్కడే ప్రాణత్యాగం చేస్తుంది. భార్య మీద ప్రేమతో ఆమె మృతదేహాన్ని భుజాన ధరించి లోకసంచారం చేస్తుంటాడు. అదే సమయంలో శివ వర ప్రసాదంతో మృత్యువును జయించానన్న అహంకారంతో తారకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పట్టి పీడిస్తుంటాడు. శివవీర్య సముద్భవంతో జన్మించి, కన్యకల పాలచేత పెంచబడ్డ వాడివల్ల తప్ప మరెవరి చేతిలోనూ మరణం సంభవించదన్న వరం తారకాసురుడుది. ఇటు చూస్తే సతీ వియోగంతో శివుడు అనంత బాధలో ఉంటాడు. పార్వతీదేవిని శివుడు పెళ్లాడితే వారికి పుట్టబోయే కుమారస్వామి వల్లే, తారకాసురుడు చనిపోతాడని దేవతలకు తెలియడంతో వారు శివుడిని అందుకు ఒప్పిస్తారు. కానీ, మొదటి వివాహ బంధం నుంచి శివుడు విముక్తి కావాల్సి ఉంటుందని పరాశక్తి చెబుతుంది. దీంతో విష్ణుమూర్తి తన విష్ణు చక్రంతో సతీదేవి మృతదేహాన్ని ఖండిస్తాడు. మొత్తం పద్దెనిమి భాగాల్లో ఊర్థ్వ దంతం పడిన చోటు ఆలంపూర్. ఇక్కడే అమ్మవారు జోగులాంబగా అవతరించారు.
విశిష్టరూపం
పరమపావనమైన ఆలంపూర్ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజోవంతమై దర్శనమిస్తారు. కేశాలు గాలిలో తేలుతున్నట్లు ఉండి, వాటిలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం వంటివి కనిపిస్తాయి. ఎవరి ఇంట్లో అయినా జీవకళ తగ్గితే అక్కడ బల్లుల సంఖ్య పెరుగుతుందని, ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడికి తేళ్లు చేరుతాయని, దీని సారాంశం. ఆ తర్వాతి దశ అక్కడికి గబ్బిలాలు చేరండం, ఆ జీవ కళ మరింత క్షీణిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చెప్పడానికి అమ్మవారి తలలో ఉన్న కపాలం ఓ ఉదాహరణ అని ఐతిహ్యం. ఇంట్లో జరిగే శుభాశుభాలకు అమ్మవారు ప్రతిరూపం అని, అందుకే జోగులాంబ అమ్మవారిని గృహచండిగా పేర్కొనడం అనాదిగా వస్తోంది. వాస్తుదోష నివారణలకు కూడా అమ్మవారిని మొక్కితే త్వరితగతిన ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం.
విశిష్ట నిర్మాణం
అలంపూర్ జోగులాంబ ఆలయ దర్శనం, భక్తులకు మరపురాని ఆధ్యాత్మిక అనుభూతిని మిగుల్చుతుంది. ఆలయ పురాతన నిర్మాణ శైలి భక్తులను కట్టిపడేస్తుంది. క్రీస్తు శకం 6వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని చాళుక్యరాజులు నిర్మించారు. అత్యద్భుతమైన గోపురాలు, వాటిపై ఉన్న శిల్పకళ, స్తంభాలు అప్పటి నిర్మాణశైలికి సజీవ సాక్ష్యంగా ఉన్నాయి. 14 వ శతాబ్ధంలో బహమనీ సుల్తాన్ ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. అయితే, ఈ దాడిలో ఆలయం దెబ్బతిన్నా, జోగులాంబ అమ్మవారు, ఆమె శక్తి రూపాలైన చండీ, ముండీలను సమీపంలోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దాచిపెట్టారు. అప్పటినుంచి 2005 వరకూ అమ్మవారు ఇదే ఆలయంలో కొలువై పూజలు అందుకున్నారు. 2005లో కొత్త ఆలయాన్ని నిర్మించి అమ్మవారని పునప్రతిష్టించారు.
ప్రత్యేక పూజలు
శక్తి రూపమైన అమ్మవారు కొలువైన ఈ క్షేత్రంలో పూజలు, అభిషేకాలతో నిత్యం ఆధ్యాత్మికం సంరంభం కనిపిస్తుంది. రోజూవారీ పూజలతో పాటు, ఆ తల్లికి ప్రీతికరమైన మంగళ, శుక్రవారాల్లో ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా ప్రసిద్ధమైన ఇక్కడి అమ్మవారిని దర్శించుకునేందుకు నిత్యం వందల సంఖయ్లో భక్తులు వస్తుంటారు. సంతాన సమస్యలు, అనారోగ్యసమస్యలు ఉన్నవారి పాలిట జోగులాంబ అపాద్భాంధవ పాత్ర పోషిస్తుంది.
ఎలా చేరుకోవాలి?
హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్లే బస్సులన్నీ ఆలంపూర్ మీదుగానే వెళతాయి. కర్నూలుకు కేవలం 12 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాల నుంచి కర్నూలుకు బస్సు సౌకర్యం ఉంది. ఈ ఆలయానికి సమీపంలోని రైల్వేస్టేషన్ కర్నూలు.
జోగులాంబ మహాదేవి రౌద్ర వీక్షణాలోచన ఆలంపురీ స్థిత మాతా సర్వత్రా ఫల సిద్ధిదా..!
పావన కృష్ణవేణీ నదీ తీరపు పరవళ్లు, మదిని మైమరిపించే పరిసరాల మధ్య నెలవైన ఆధ్యాత్మిక ప్రదేశం అమరావతి. పరమేశ్వరుడు అమరలింగేశ్వరుడిగా కొలువై ఇక్కడ భక్తజనాన్ని దీవిస్తున్నాడు. ఇక్కడి స్వామిని అమరేశ్వరుడు, క్రౌంచనాథుడు అని కూడా అంటారు. రాష్ట్రంలో ఉన్న పంచారామ క్షేత్రాల్లో మొదటిది ఈ అమరావతి పుణ్యస్థలం.

పంచారామ క్షేత్రాల్లోనే పరమపవిత్రమైనది అమరావతి. దాదాపు పదిహేను అడుగుల ఎత్తైన లింగరూపంలో కొలువై ఉండడం అమరలింగేశ్వరుని విశిష్టత. సుప్రసిద్ధ శైవప్రదేశంగా విరాజిల్లుతున్న అమరావతి క్షేత్రానికి విశిష్టమైన స్థల పురాణం ఉంది.

క్షీరసాగర మథనం జరుగుతున్న సమయంలో ఆత్మలింగం ఉద్భవించింది. ఈ ఆత్మలింగాన్ని తారకాసురుడు అనే రాక్షసుడు మెడలో ధరించి శివు కోసం ఘోర తప్పస్సు చేయగా, పరమేశ్వరుడు ప్రత్యక్షమై అతనికి మరణం లేకుండా వరం ఇస్తాడు. అయితే, దేవతలపై యుద్ధం చేసే పక్షంలో తనపై గాని, తన సంతతిపై గాని దాడి చేస్తే ఖండఖండాలవుతాని శివుడు ఓ షరతు పెడతాడు. కాలక్రమంలో శివుని కుమారుడు కుమారస్వామితో, తారకాసురుడు తలపడగా, అతని తల ముక్కలుగానూ, అతని మెడలోని ఆత్మలింగం అయిదు ముక్కలుగానూ పగిలిపోతుంది. ఈ ఆత్మలింగ శకలాల్లో ఒకటి ఇంద్రునిచే అమరావతిలో ప్రతిష్టమయ్యిందని పురాణాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అమరావతిలోని శివలింగం అదేనని భక్తుల విశ్వాసం. సుమారు పదిహేను అడుగుల ఎత్తున ఇక్కడ శివలింగం భక్తులకు దర్శనమిస్తుంది.

సకల శుభకరం

పవిత్ర దివ్యదైవమైన అమరేశ్వరుని దర్శనం సకల శుభకరం అని ప్రతీతి. ఇక్కడ మరణిస్తే, వారి ఆత్మ శివునిలో కలిసిపోతుందని చెబుతారు. అంతటి మహిమాకరుడట ఇక్కడి శివుడు. 15 అడుగుల ఎత్తైన రూపంలో కనిపించే అమరేశ్వరుడిని దర్శించిన భక్తుల జీవితాలను సైతం ఉన్నతస్థితి చేర్చుతాడట. ఆయన రూపం ద్వారానే ఈ విషయాన్ని చాటుతుంటాడని చెబుతారు.

మహిమాకరుడైన ఇక్కడి అమరలింగేశ్వరుడిని ప్రతినిత్యం విశేష సంఖ్యలో భక్తులు దర్సించుకుంటారు. అమరము అంటే అంతం లేనిది అని అర్థం. తనను మొక్కిన భక్తులకు అసలు అంతం లేని శుభాలను అందించి, వారి జీవితాలను శుభ్రదం చేస్తాడు కనుకనే, ఈయనకు అమరేశ్వరుడు అని పేరు వచ్చిందంటారు.

అలంకార ప్రియుడు

శివుడు ఆది దేవుడు. అంతటి శక్తిమంత దైవానికి అమరావతి క్షేత్రంలో నిత్యం అంగరంగ వైభవంగా పూజాపునస్కారాలు జరుగుతుంటాయి. ఇక్కడ స్వామిని సుందరంగా అలంకరించి పూజాధికాలు నిర్వహిస్తారు. అభిషేక ప్రియుడని పేరున్న శివుడు అమరావతిలో మాత్రం అలంకార ప్ర్రియుడిగా దర్శనమిస్తాడు. ఆలయం కూడా సువిశాల స్థలంలో నిర్మితమయ్యింది. బౌద్ధ, ద్రవిడ శైలిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఐదు పంచారామ వివరాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి.

చేరుకోవడం ఎలా?
అమరావతి క్షేత్రం గుంటూరుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుంటూరు నుంచి నిరంతరం బస్సు సర్వీసులు ఉంటాయి. విజయవాడ నుంచి కూడా తరచూ బస్సులు వెళుతుంటాయి. వాహనాల్లో వెళ్లేవారు విజయవాడ నుంచి కృష్ణానది కరకట్ట ద్వారా వెళ్లవచ్చు.

వసతి.. ఇతర దర్శనీయ స్థలాలు..
అమరావతిలో ఏపీ టూరిజం వారి హరిత గెస్ట్ హౌస్ ఉంది. ముందుగానే గదులు బుకింగ్ చేసుకోవచ్చు. ఇతర లాడ్జిలు కూడా అందుబాటులో ఉంటాయి.
అమరావతిలోనే కాలచక్రం నిర్వహించారు. ఇక్కడ అతిపెద్ద బుద్ధ విగ్రహం అందరికీ ఆహ్వానం పలుకుతుంది. పురావస్తు శాఖవారి మ్యూజియం కూడా ఉంది.